హైదరాబాద్:రాజ్యసభకు వెళ్లనున్న తెరాస అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది.మూడు రాజ్య సభ స్థానాలకు అభ్యర్థులను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హెటిరో గ్రూపు ఛైర్మన్ బండి పార్థసారథి రెడ్డి,నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు,గాయత్రి గ్రానైట్స్ అధినేత,తెరాస నాయకుడు గాయత్రి రవిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు.”బండ ప్రకాశ్,డి.శ్రీనివాస్,కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో ఈ ముగ్గురు నేతలను పెద్దల సభకు పంపాలని తెరాస నిర్ణయించింది. వివిధ రాజకీయ,సామాజిక,ఆర్థిక సమీకరణలను పరిశీలించిన పార్టీ నాయకత్వం రెడ్డి,వెలమ,మున్నూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను ఎంపిక చేసింది.బండ ప్రకాశ్ రాజ్య సభకు రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైనందున ఆ స్థానానికి జరగనున్న ఉపఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది.బండ ప్రకాశ్ స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి రెండేళ్ల పదవీ కా లం ఉంటుంది.బండ ప్రకాశ్ స్థానంలో గాయత్రి రవి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.”డీఎస్,లక్ష్మీకాంతరావు స్థానంలో ఎన్నికకు ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్ల దా ఖలు ప్రక్రియ కొనసాగనుంది.కేసీఆర్కు సన్నిహతులైన పార్థసారథి రెడ్డి,దామోదర్ రావు పేర్లను గతంలోనూ రాజ్యసభ,ఎమ్మెల్సీలకు పరిశీలించినప్పటికీ వివిధ సమీకరణల వల్ల అవకాశం ఇవ్వలే దు.ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమే.ఒకేసారి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా ముమ్మర కసరత్తు చేశారు.మూ డుస్థానాల కోసం సుమారు పది మందికి పైగా ఆశించినా చివరకు వీరివైపే మొగ్గుచూపారు.