BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు.
అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో తెలంగాణ అధికార బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగలడం ఖాయమని తెలుస్తోంది. జరగబోయే ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక విషయంలో కొందర్ని పక్కనబెట్టడంపై ఆయా నేతలు గులాబీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పట్ల గుర్రుగా ఉన్నారు. టికెట్ ఇవ్వకపోతే ఊరుకుంటామా తాడో పేడో తేల్చుకుంటామని శపథం చేస్తున్నారు
బీఆర్ఎస్కి చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం ఇదే పంతం పట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా, ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావును టికెట్ల విషయంలో పక్కనపెట్టడాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, ఆయన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.అందుకే పోటీ నుంచి తప్పించామని ఫీలవుతున్న బీఆర్ఎస్ అధినేతకు జలక్ ఇచ్చేలా తుమ్మలకు రాచబాట వేస్తున్నారు
బీఆర్ఎస్ తొలి జాబితాలో తన లేకపోవడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నట్లుగా శుక్రవారం తేలిపోయింది. తుమ్మల హైదరాబాద్ నుంచి శుక్రవారం ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఆయన రాకను స్వాగతిస్తూ మద్దతుదారులు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలోనే తుమ్మల తన స్వరాన్ని స్పష్టంగా వినిపించారు.
వెయ్యి కార్లు, రెండు వేల బైక్లతో అనుచరులు భారీ ర్యాలీతో ఆహ్వానం పలకడంతో తుమ్మల తన రాజకీయ జీవితం ఖమ్మం ప్రజలకు అంకితమిస్తానని చెప్పారు. తనను పోటీ నుంచి తొలగించామనుకుంటన్న నేతలది తాత్కాలిక ఆనందమేనని..తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని సవాల్ విసిరారు.
తన తుది శ్వాత అయినా వదులుతా కానీ తలవంచేది లేదంటూ బీఆర్ఎస్పై ధిక్కార స్వరాన్ని వినిపించారు. రాజకీయంగా తాను కిందపడ్డా ఖమ్మం జిల్లా ప్రజలు అండగా నిలిచి అక్కున చేర్చుకున్నారని తిరిగి తనను అదే గౌరవప్రదమైన స్థాయిలో నిలబెట్టారని చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజల అభిమానం, అండదండలు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని బీఆర్ఎస్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు
ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయకన్ గూడెం నుంచి భారీ ర్యాలీగా ఖమ్మం నగరంలోని తన నివాసానికి చేరుకుని అక్కడ జరిగిన సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. తన 4నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితంలో రాముల వారి ఆశీస్సులతో ప్రజలకు మంచే చేశానన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తుమ్మల.
గత కొంతకాలంగా తుమ్మల పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్నటువంటి తుమ్మలను టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానించారని..ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగానే కేసీఆర్ తుమ్మల టికెట్ కన్ఫామ్ చేయకపోవడంతో శుక్రవారం ర్యాలీలో బీఆర్ఎస్ జెండాలు కాని, కేసీఆర్ ఫోటోలు కాని కనిపించలేదు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాగా పట్టున్న తుమ్మలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తే ఫలితంగా పాలేరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమని జిల్లా ప్రజలే అంటున్నారు. ఓవైపు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా..బరిలోకి దిగితే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా తుమ్మల పేరు ప్రకటించకపోవడంతో ఆయన కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ఆయన పర్మినెంట్ స్థానమైన పాలేరు లేదా ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగే అవకాశాలు బాగా ఉన్నాయి. శుక్రవారం చేపట్టిన భారీ ర్యాలీ సక్సెస్ అయినట్లుగానే తుమ్మల కాంగ్రెస్లో చేరితే గెలుపు కూడా ఖాయమంటున్నారు అభిమానులు
మొదట్నుంచి బీఆర్ఎస్కు తక్కువ పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల పార్టీ మార్పుతో మరింత నష్టం జరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పొంగులేటిని చేజార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ ..తుమ్మలను వదులుకోవడం ఆపార్టీకే నష్టమని ప్రజలు సైతం చెప్పుకుంటున్నారు. అయితే తుమ్మల కాంగ్రెస్లో చేరుతారా లేదా చేరితే ఎప్పుడు ముహుర్తం ఫిక్స్ చేస్తారని క్యాడర్ అంతా ఎదురుచూస్తోంది
అధికార బీఆర్ఎస్లో సీనియర్ నేతలుగా ఉన్నవాళ్లంతా రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ నుంచి కేసీఆర్ పిలుపుతో గులాబీ పార్టీలో చేరిన వాళ్లే. ఇప్పుడు కేసీఆర్ టీడీపీ సీనియర్లు, మరీ ముఖ్యంగా ఓడిపోయిన నేతల్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ..ఇక్కడ ఉండి అవమానపడటం కంటే ..టీడీపీ నేత అయిన రేవంత్రెడ్డితో కలిసి కాంగ్రెస్ కోసం పని చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది