కాలభైరవాష్టమి

వారణాసి: కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి గా సంభావిస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది.
ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు.
ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు ‘నేను సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి’అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.
దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది.
మహోన్నత కాయముతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు.

హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞమేరకు కారభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు.
‘నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి..’ అని శివుడు సలహా ఇచ్చాడు.
దీనితోకాలభైరవుడు బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు.

అందుకు ”కాలభైరా! నీవు శివుని పుత్రుడివి. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు.
నీవు కాశీ క్షేత్రాన్ని వెళ్లు . కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది ‘అని సలహా మహావిష్ణువు ఇచ్చాడు.

దీనితో కాలభైరవుడు కాశీచేరుకున్నాడు. ఆయనబ్రహ్మహత్యాదోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశిలో పూడ్చి పెట్డాడు. బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని ‘కపాల మోక్ష తీర్థం’
తర్వాత కాలభైరవుడని చూరి శివుడు ‘కాలభైరవా! నీవు ఇక్కడే కొలుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపటుట. ముందుగా నీకే పూజలు జరుగుతాయి. నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి’ శివుడు పలికాడు.

దీనిలో శ్రీకాల భైరవుడు కాశీక్షేత్రంలో కొలువు దీరి క్షేత్రపాలకునిగా పూజలందుకొంటున్నాడు.
కాశీక్షేత్రాన్ని దర్శించినవారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీనుంచి వచ్చిన వారు కాశీసమారాధన చేయడం ఆచారం అయింది.
కాశీక్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశే్వశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం శునకమునకు పసుపుకుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు.
ఆ ఆచారాలు శ్రీకాలభైరవ స్వామి వారి మాహాత్మ్యానికి నిదర్శనం.
ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీకాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు…

ఈ మార్గశిర అష్టమి కాలభైరవజన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకం ను పారాయణ చేస్తారు. ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి. శ్రీకాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయ. గ్రహదోషాలు తొలగిపోతాయని పురాణ వచనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here